ఢిల్లీ స్కూల్లో కరోనా వైరస్ కలకలం
కరోనా బాధితుడి పిల్లలతో చనువుగా ఉన్న 40 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించారు.ఈ నేపథ్యంలో శ్రీరామ్ మిలీనియం స్కూల్ యాజమాన్యం అప్రమత్తమైంది.

న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ (కొవిడ్-19) కలకలం రేపుతుంది. ఢిల్లీలో కరోనాబారిన పడిన వ్యక్తి పిల్లలు నోయిడాలోని శ్రీరామ్ మిలీనియం స్కూల్లో చదువుకుంటున్నారు. అతడి ఇంట్లో జరిగిన బర్త్ డే పార్టీకి ఆ స్కూల్ విద్యార్థులు కొందరు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీరామ్ మిలీనియం స్కూల్ యాజమాన్యం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా రెండు రోజుల పాటు స్కూల్కు సెలవు ప్రకటించింది. అంతేకాదు కరోనా బాధితుడి పిల్లలతో చనువుగా ఉన్న 40 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించారు. శాంపిల్స్ పుణె వైరాలజీ ల్యాబ్కు పంపింపి రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ విద్యార్థులను 28 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులోనే ఉంచనున్నారు.
మరోవైపు నోయిడాలోని మరో స్కూల్ కూడా మూతపడింది. నోయిడాలోని సెక్టార్ 168లో ఉన్న శివనాదర్ స్కూల్ను మార్చి 4 నుంచి మార్చి 9 వరకు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కాగా, సోమవారం తెలంగాణ, రాజస్థాన్తో పాటు ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఇటీవల ఇటలీ నుంచి తిరిగొచ్చిన అతడికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతరులకు వైరస్ సోకకుండా బాధితుడికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
తాజా ఇంగ్లీష్ వార్తల కసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/english-news/