కారేపల్లి గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన లో 4 కు చేరిన మృతుల సంఖ్య
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య నాల్గు కు చేరింది. చీమలపాడు వద్ద నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, వైరా ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ క్రమంలో నేతలను ఆహ్వానిస్తూ బిఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. దీంతో ఆ నిప్పురవ్వలు ఎగిరిపడి సభా ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలో ఉన్న గుడిసెపై పడ్డాయి. దీంతో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్కు మంటలు అంటుకుని అది పేలిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ప్రమాదానికి గురయ్యారు. ఘటనా స్థలంలో రమేశ్, మంగు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సందీప్ , లక్ష్మణ్ మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకి చేరింది.
ఈ ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి సమీపంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలవడం బాధాకరమన్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు వ్యక్తిగతంగా రూ. 2 లక్షలు, గాయాలైన వారికి రూ. 50 వేలు ప్రకటించారు.
అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో, అధికారులతో కేటీఆర్ మాట్లాడారు. మృతుడి కుటుంబం, క్షతగాత్రులను ఆదుకుంటామన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కేటీఆర్ ఆదేశించారు.