హైదరాబాద్ లో విషాదం : కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌ లో విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు పక్కన కారు ఆపిన డ్రైవర్ సడెన్‌గా డోర్ తీయటంతో బైక్ వెళ్తున్న రెండేళ్ల పాప మృత్యువాత పడింది.

వివరాల్లోకి వెళ్తే..

శశిరేఖ, సయ్యద్ దంపతులకు ధనలక్ష్మి అనే రెండేళ్ల చిన్నారి ఉంది. సయ్యద్ దంపతులు తమ పాపన తీసుకొని బైక్‌పై వెళ్తుండగా.. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి సమీపంలోకి రాగానే.. ఓ వ్యక్తి రోడ్డు పక్కన కారు ఆపాడు. ఆపై వెనుక నుంచి ఎవరు వస్తున్నారో చూసుకోకుండా సడెన్‌గా కారు డోర్ తీశాడు. అంతే.. వెనుక నుంచి బైక్ వస్తున్న సయ్యద్ బైక్‌కు కారు డోరు తగిలింది. ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు కిందపడిపోగా.. ధనలక్ష్మి అక్కడిక్కడే మృతి చెందింది. సయ్యద్, శశిరేఖ దంపతులకు గాయాలయ్యాయి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది. ఘటన తర్వాత కారు డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.