లోకేశ్ ప్రభంజనం చూసి జగన్ కు చెమటలు పడుతున్నాయిః అచ్చెన్నాయుడు

అందుకే అల్లరి మూకలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం

TDP AP president Atchannaidu

అమరావతిః కడప జిల్లా ప్రొద్దుటూరులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో గతరాత్రి కోడిగుడ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. లోకేశ్ లక్ష్యంగా విసిరిన కోడిగుడ్లు భద్రతాసిబ్బందిపై పడ్డాయి. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన టిడిపి కార్యకర్తలు గుడ్లు విసిరిన వ్యక్తిని చితకబాదారు. ఈ ఘటనపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు.

నారా లోకేశ్ పాదయాత్రలో జన ప్రభంజనం చూసి జగన్ కు ఏసీలో ఉన్నా చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. అందుకే అల్లరి మూకలను రెచ్చగొట్టి పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ పై కోడిగుడ్ల దాడిని ఖండిస్తున్నట్టు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. లోకేశ్ పాదయాత్రలో కోడిగుడ్లు విసిరిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.