బిపర్‌జోయ్ ప్రభావం: భుజ్ విమానాశ్రయం క్లోజ్..కచ్ సహా పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

18-teams-deployed-and-over-45000-evacuated-says-ndrf

గాంధీనగర్‌ః అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుఫాను తీరం దిశగా ముంచుకొస్తోంది. గురువారం సాయంత్రం తుఫాను గుజరాత్ లోని జఖౌ సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో ఈ తుఫాను కలిగించే నష్టాన్ని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీర ప్రాంత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కచ్ సహా పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భుజ్ విమానాశ్రయాన్ని జూలై 16 వరకు క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మాండ్విలోని స్వామినారాయణ టెంపుల్ లో దాదాపు 5000 ఫుడ్ ప్యాకెట్స్ ను అవసరమైన సమయంలో ఇచ్చేందుకు సిద్ధం చేశారు. బిపర్ జోయ్ తుఫాను నేపథ్యంలో చేపలు పట్టేందుకు ఎవరూ సముద్రంలోకి వెళ్లడం లేదు. దీంతో కచ్ తీరంలో పెద్ద ఎత్తున పడవలు నిలిచిపోయాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ కచ్ లోని ఆసుపత్రులను తనిఖీ చేశారు. ఆక్సిజన్, వెంటిలెటర్, క్రిటికల్ కేర్ బెడ్స్ తదితర వివరాలపై ఆసుపత్రి వర్గాల నుండి ఆరా తీశారు. సైక్లోన్ అనంతరం సిద్ధంగా ఉండాలని, ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉండాలని ఆదేశించారు.

బిపర్ జోయ్ తుఫాను నేపథ్యంలో గుజరాత్ తీర ప్రాంతాల్లో 4500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది. వీరికి ద్వారకలో షెల్టర్ హోమ్స్ సిద్ధం చేశారు. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని ఏడు జిల్లాల నుండి మొత్తం 47000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 18 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ను సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో సిద్ధం చేశారు. తుఫాను నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 69 రైళ్లను క్యాన్సిల్ చేశారు.