మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బిఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్‌

CM KCR Participating in Inauguration of BRS Party Office at Nagpur District, Maharashtra

ముంబయిః తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బిఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని గురువారం మ‌ధ్యాహ్నం ప్రారంభించారు. పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ జెండాను కెసిఆర్ ఆవిష్క‌రించారు. అనంత‌రం రిబ్బ‌న్ క‌ట్ చేసి పార్టీ ఆఫీసులోకి ప్ర‌వేశించారు. కార్యాల‌యంలో లోప‌ల నిర్వ‌హించిన అమ్మ‌వారి పూజలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కెసిఆర్‌ను వేద పండితులు ఆశీర్వ‌దించారు.

పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఎంపీలు కేశ‌వ‌రావు, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, దానం నాగేంద‌ర్‌, ఏపీ బిఆర్ఎస్ అధ్య‌క్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధుల‌, మ‌హారాష్ట‌కు చెందిన బీఆర్ఎస్ నేత‌లు పాల్గొన్నారు. నాగ్‌పూర్‌ పట్టణమంతా బిఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, జెండాలతో నిండిపోయింది. ఎక్కడ చూసిన సీఎం కెసిఆర్‌ ముఖచిత్రంతో కూడిన ‘అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌’ హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి.