పరవాడలో భారీ అగ్ని ప్రమాదం..నలుగురు మృతి
ఏపీలోని అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. పరవాడ ఫార్మా సిటీ లోని లారస్ యూనిట్ 3 లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. లారస్ యూనిట్లో పని చేస్తున్న వారిలో నలుగురు మృతి చెందగా, మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది.
పలువురు ఉద్యోగులు గాయపడినట్లు తెలుస్తున్నది. ఈ విషయం తెలిసి వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. షార్ట్ షర్క్యూట్కు పూర్తి కారణాలు తెలియరాలేదు. అనకాపల్లిలోని వివిధ దవాఖానల నుంచి అంబులెన్స్లు ఫార్మాసిటీ యూనిట్ వద్దకు చేరుకుని బాధితులను తరలిస్తున్నాయి. హాస్పటల్ లో చికిత్స పొందుతూ రాంబాబు, రాజేష్, రామకృష్ణ, వెంకట్రావులు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.