ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బొల్లారం, సోమాజీగూడతో పాటు నగరంలో పలు ప్రాంతాల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 10 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

శీతాకాల విడిది కోసం ఈమె రేపు హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ముస్తాబవుతుంది. వారం రోజులపాటు ఇక్కడే బస చేయనున్నారు. దీంతో బొల్లారంలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాలను భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. విష సర్పాలు, కీటకాలు ప్రవేశించకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించారు.

మూడేళ్లుగా రాష్ట్రపతి హైదరాబాద్ కు రాలేదు. చివరిసారిగా 2019 డిసెంబర్ లో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి ఆలయాన్ని సందర్శించారు. రెండేళ్ల విరామం అనంతరం ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఇక ఈనెల 27న నారాయణగూడ లోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి సమావేశం కానున్నారు.