పదవుల్లో సొంత సామాజికవర్గానికే జగన్ పెద్దపీట వేస్తున్నారు – అచ్చెన్నాయుడు

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్ ఫై నిప్పులు చెరిగారు. పదవుల్లో సొంత సామాజికవర్గానికే జగన్ పెద్దపీట వేస్తున్నారని , మిగిలిన వారికి కత్తిపీట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పదవుల పంపకంలో ఆయన సామాజికవర్గానికే పెద్ద వేస్తున్నారని… బడ్జెట్ లో సైతం ఇతర సామాజికవర్గాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. జనాభాలో 5.53 శాతం ఉన్న గిరిజనుల పింఛన్లకు రూ. 971 కోట్లు కేటాయించిన జగన్ తన సామాజికవర్గానికి చెందిన రెడ్డి కార్పొరేషన్ కు రూ. 1,555 కోట్లు కేటాయించారు.

దామాషా ప్రకారం 17.08 శాతం ఉన్న ఎస్సీలకు రూ. 7 వేల కోట్లు, 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రూ. 16 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా… ఎస్సీలకు రూ. 3 వేల కోట్లు, బీసీలకు రూ. 8 వేల కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలంటే జగన్‌కు ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అన్ని కులాలను ఆదరించాలన్నారు. అలా కాకుండా తన సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తూ సీఎం జగన్‌ చేస్తున్న మోసాలను మిగిలిన వర్గాలు గ్రహించి వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీ కి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.