హైదరాబాద్ శివారులో విషాదం..
హైదరాబాద్ శివారులో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు మరణించిన ఘటన జవహర్నగర్లో చోటుచేసుకుంది. జవహార్నగర్ పరిధిలో ఉన్న మల్కాపురంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో 5 మంది మదర్సా విద్యార్థులు, కాగా ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. వీరంతా అంబర్పేటలోని మదర్సా విద్యార్థులుగా గుర్తించారు.
మేడ్చల్ జిల్లా జవహార్నగర్లోని స్థానిక మదర్సా విద్యార్థులను ఉపాధ్యాయుడు టూర్లాగా బయటికి తీసుకెళ్లారు. మల్కాపురం ఎర్రగుంట చెరువులో ఈత కొట్టడానికి చెరువులోకి ఐదుగురు విద్యార్థులు దిగారు. చెరువు లోతుగా ఉండడంతో మునిగిపోతున్న విద్యార్థులను కాపాడానికి ఉపాధ్యాయుడు కూడా దిగారు. పిల్లలంతా ఉపాధ్యాయుడ్ని పట్టుకోవడంతో బయటికిరాలేక అందరూ నీటిలో మునిగిపోయారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి పోలీసులు మృతదేహాలను వెలికితీశారు.