యువగళం విజయోత్సవ సభ…ధర్మవరం నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు
రేపు పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభ
అమరావతిః టిడిపి యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద రేపు జరగనున్న భారీ బహిరంగ సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, లోకేశ్ పాల్గొంటారు. ఈ సభకు దాదాపు 6 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండడంతో సరిపడా గ్యాలరీలు సిద్ధం చేశారు. చుట్టుపక్కల నుంచి వాహనాల్లో తరలివచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు.
యువగళం ముగింపు సభకు హాజరయ్యేందుకు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి అభిమానులతో ప్రత్యేక రైలు బయలుదేరింది. ఇది అనంతపురం, గుత్తి మీదుగా విశాఖపట్టణం చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో కార్యకర్తలు, అభిమానులు పోలిపల్లి సభకు చేరుకుంటారు.