తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం : వైఎస్ షర్మిల
నేను రెండు స్థానాల్లో పోటీ చేస్తా.. వైఎస్ షర్మిల
హైదరాబాద్ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్టిపి ఒంటరిగానే పోటీ చేయబోతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల పార్టీ నేతలతో ఈరోజు షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో వైఎస్ఆర్టిపి పోటీ చేస్తుందని వెల్లడించారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని అనుకున్నామని… కాంగ్రెస్ తో చర్చలు జరిపామని… నాలుగు నెలలు వేచి చూశామని చెప్పారు. తాను పాలేరుతో పాటు మరో స్థానంలో పోటీ చేస్తానని చెప్పారు. తన తల్లి విజయమ్మ, తన భర్త అనిల్ కూడా పోటీ చేయాలనే డిమాండ్లు ఉన్నాయని తెలిపారు. విజయమ్మ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బీఫామ్ ల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.