ఇప్పుడు ఎందుకో దొర పొర్లు దండాలు పెడుతుండు

ఈ ప్రేమంతా హుజూరాబాద్ ఎన్నిక మహిమ: ష‌ర్మిల‌

హైదరాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల సీఎం కెసిఆర్ పై మండిప‌డ్డారు. హుజూరాబాద్ ఉప‌ ఎన్నిక నేప‌థ్యంలో ద‌ళితులపై ఉన్న‌ట్టుండి ఆయ‌న ప్రేమ కురిపిస్తున్నార‌ని ష‌ర్మిల విమ‌ర్శించారు. ‘ఏడేండ్లలో ఎప్పుడూ అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయని దొర ఇప్పుడు పొర్లు దండాలు పెడుతుండు. సీఎంవోలో ఒక్క దళిత ఆఫీసర్ నూ పెట్టుకోని సారు ఇప్పుడు దళిత ఆఫీసర్లని నెత్తిల పెట్టుకుంటున్నడు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సగం కూడా ఖర్చు చెయ్యని సారు దళిత ఓట్ల కోసం 2 వేల కోట్ల రూపాయ‌లు ఖర్చు పెట్టేందుకు సిద్దమైనడు’ అని ష‌ర్మిల విమ‌ర్శించారు.

‘ఈ ప్రేమంతా హుజూరాబాద్ ఎన్నిక మహిమ. మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే.. ఈ డ్రామాలు ఆపి.. ఐదేండ్ల కింద అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారు హామీ ఇచ్చిన.. మెగా లెదర్ పార్కును ఏర్పాటు చేసి.. 20 వేల మంది దళితులకు ఉపాధి చూపండి’ అని ష‌ర్మిల డిమాండ్ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/