మంత్రి రోజాకు సొంత నియోజకవర్గంలో నిరసన సెగ

రోజా ప్రారంభించనున్నభవనాన్నికి తాళం వేసిన వైఎస్‌ఆర్‌సిపి జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి

ysrcp-zptc-arrested-in-ap-minister-roja-constituency-nagari

అమరావతిః ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు తన సొంత నియోజకవర్గం నగరిలో మరోమారు నిరసన సెగ తగిలింది. ఆ నిరసన సెగ కూడా తన సొంత పార్టీకి చెందిన నేతల నుంచే కావడం గమనార్హం. నగరి పరిదిలోని వడమాలపేట మండలం పత్తిపుత్తూరులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించేందుకు రోజా వెళుతున్న సమయంలో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరిలో రోజాకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సిపిలో ఓ వర్గం తమ పరిధిలోని గ్రామాల్లోకి రోజాను రానివ్వకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వడమాలపేట మండల జడ్పీటీసీగా కొనసాగుతున్న మురళీధర్ రెడ్డి… రోజాకు వ్యతిరేక వర్గంలో ఉన్నారు. రోజా తన మండలానికి వస్తున్నారన్న సమచారం అందుకున్న ఆయన తన సోదరుడు రవి రెడ్డితో కలిసి పత్తిపుత్తూరు వెళ్లారు. అక్కడ రోజా చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న గ్రామ సచివాలయ భవనానికి ఆయన తాళం వేశారు. ఈ భవనాన్ని తానే నిర్మించానని, అయితే అందుకు సంబంధించిన బిల్లులు ఇంకా విడుదల కాలేదని…బిల్లులు ఇప్పించిన తర్వాతే తాళం తీస్తానని ఆయన బీష్మించారు.

అయితే అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న రోజా వర్గీయులు మురళీధర్ రెడ్డి వర్గీయులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, పరస్పర దాడులు చోటుచేసుకున్నాయి. అనంతరం రోజా వర్గీయులు గ్రామ సచివాలయ భవనానికి వేసిన తాళాన్ని పగులగొట్టారు. దీంతొ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా… రంగ ప్రవేశం చేసిన పోలీసులు మురళీధర్ రెడ్డితో పాటు రవి రెడ్డిని అరెస్ట్ చేసి వడమాలపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత గ్రామానికి చేరుకున్న రోజా గ్రామ సచివాలచ భవనాన్ని ప్రారంభించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/