చంద్రబాబు నివాసానికి వెళ్లనున్న వైఎస్‌ షర్మిల

కొడుకు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించనున్న కాంగ్రెస్ నాయకురాలు

ys-sharmila-to-meet-chandrababu

హైదరాబాద్‌ః టిడిపి అధినేత చంద్రబాబును కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల కాసేపట్లో కలవనున్నారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి ఆమె వెళ్లనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు షర్మిల అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య స్వల్ప రాజకీయ చర్చ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే షర్మిల తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు తదితరులను కలిసి వెడ్డింగ్ కార్డ్ అందజేసి, పెళ్లికి రావాలంటూ ఆహ్వానించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు కూడా పెళ్లి శుభలేఖలు అందజేశారు.

మరోవైపు క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు కుటుంబానికి షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతేకాదు, షర్మిలకు కూడా గిఫ్ట్ పంపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య ఆత్మీయ అనుబంధం నెలకొంది. అట్లూరి ప్రియను రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఈ నెల 18న వీరి నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17న వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.