ఎమ్మెల్సీ కవితకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ
హైదరాబాద్ః బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి లేఖ రాశారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు మీరు చూడాలి అనుకుంటున్న మార్పు, మీ నుంచే మొదలు పెట్టండి..మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి 5 శాతం కూడా మహిళలకు సీట్లు ఇవ్వలేదని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.
నా అభిప్రాయంతో పాటు,ఇటీవల బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా సైతం పంపుతున్న జాబితా తో పాటు ఒక కాలిక్యులేటర్ లింక్ సైతం పంపిస్తున్నానని లేఖలో వివరించారు. బిఆర్ఎస్ జాబితా చూసి 33శాతం ఇచ్చారా? లేదా? లెక్కించండని.. మద్దతు కూడగట్టే ముందు మీ తండ్రితో ఈ విషయం చర్చ చేయాలని మనవి అంటూ పేర్కొన్నారు.
2004 నుంచి ఇప్పటి వరకు మహిళలకు మీరిచ్చిన సీట్లు ఎన్ని ? 2014లో మహిళలకు మీరిచ్చిన సీట్లు 6 అని గుర్తుకు లేదా ? అని కవితపై విరుచుకుపడ్డారు. 2018 లో మీరిచ్చిన సీట్లు 4 అని మీకు కనపడటం లేదా ?సీట్ల కేటాయింపు లో ఒక మహిళగా మీరు నోరు ఎందుకు ఎత్తలేదు ? అని షర్మిల ప్రశ్నించారు.