అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదుః ప్రధాని మోడీ
ఈ విషయంలో భయపడకుండా దృఢంగా ఉండాలని సూచన
న్యూఢిల్లీః ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన విజిలెన్స్ వీక్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టమైన సందేశం ఇచ్చారు. అవినీతి, అవినీతి పరులకు వ్యతిరేకంగా వ్యవహరించే విషయంలో ఏజెన్సీలు, అధికారులు భయపడాల్సిన అవసరం కానీ, రక్షణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. అవినీతి పరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదన్నారు. అటువంటి వారికి రాజకీయ, సామాజిక రక్షణ కూడా లభించకూడదన్న అభిప్రాయాన్ని వినిపించారు.
‘‘అవినీతి అన్నది ఓ దెయ్యం. దానికి దూరంగా ఉండాలి. గత ఎనిమిదేళ్ల నుంచి వ్యవస్థను మర్చేందుకు కృషి చేస్తున్నాం. చాలా సందర్భాల్లో అవినీతికి పాల్పడిన వారు, అభియోగాలు రుజువై జైలుకు వెళ్లొచ్చినా కానీ కీర్తింపబడుతున్నారు. భారత సమాజానికి ఇదేమీ మంచి పరిస్థితి కాదు. నేడు కూడా అవినీతిపరులను సమర్థిస్తూ కొందరు మాట్లాడుతున్నారు. సమాజం పట్ల వారికున్న బాధ్యత, కర్తవ్యాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది’’అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అవినీతి పరులు ఎంతటి శక్తిమంతులైనా కానీ, వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగిపోకుండా, దృఢంగా వ్యవహరించాలని దర్యాప్తు ఏజెన్సీలకు ప్రధాని సూచించారు. అవినీతి పరులు తప్పించుకోకుండా చూడాలని కోరారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/