రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ వైస్ షర్మిల కామెంట్స్

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ తమిళసై ను కోరినట్లు తెలిపారు YSRTP అధ్యక్షురాలు వైస్ షర్మిల. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని, కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. శనివారం గవర్నర్ తమిళిసైతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల.. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను వివరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ను కోరినట్లు చెప్పుకొచ్చారు.

ప్రభుత్వ పెద్దలంతా తాలిబాన్లలా వ్యవహరిస్తున్నరని షర్మిల విమర్శించారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు చేస్తోందని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున వీధి కుక్కల దాడికి చిన్న పిల్లాడు బలైనా మున్సిపల్ శాఖ మంత్రి స్పందించకపోవడాన్ని షర్మిల తప్పుబట్టారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని, ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ లో ఉన్నదంతా గూండాలేనని, ప్రతిపక్షాలపై వారు దాడులు చేస్తున్నారని చెప్పారు. దేశంలో భారత రాజ్యాంగం అమల్లో ఉంటే, తెలంగాణలో మాత్రం కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. 3,800కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న తనపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని షర్మిల మండిపడ్డారు.