కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తాః వైఎస్‌ షర్మిల

ys-sharmila-joins-congress-party

న్యూఢిల్లీః వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన పార్టీ వైఎస్‌ఆర్‌ తెలంగాణను కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లు ప్రకటించారు. భర్త అనిల్‌తో పాటు ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లిన వైఎస్‌ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

అనంతరం షర్మిల మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌టిపిని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు నుంచి కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టిపిని ఒక భాగమని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్‌ అన్న షర్మిల వైఎస్‌ఆర్‌ జీవితమంతా ఆ పార్టీ కోసమే పని చేశారని చెప్పారు. రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడడం తన తండ్రి కల అని తెలిపారు. తాను తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నానని వెల్లడించారు.

“దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్‌. రాహుల్‌ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రాహుల్‌ జోడో యాత్ర ప్రజలతో నాలో కూడా విశ్వాసం నింపింది. కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తా. కెసిఆర్‌ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణలో పోటీ చేయలేదు.” అని ఈ సందర్భంగా షర్మిల చెప్పారు.