లంగర్‌హౌస్ డెడ్‌బాడీ కేసును చేధించిన పోలీసులు

లంగర్ హౌస్ పీఎస్​ పరిధిలో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా నరికి చంపి , ముక్కలుగా చేసిన పడేసిన కేసును పోలీసులు ఛేదించారు. గురువారం రాత్రి 10:30 గంటల తర్వాత దర్గా మిలట్రీ హాస్పిటల్​ సమీపంలో ఓ ఆటో నుండి ఓ వ్యక్తి, ఓ మహిళ దిగి , గోనె సంచి తెచ్చి పడేసారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని , డెడ్ బాడీ ని స్వాధీనం చేసుకొని కేసు ఫైల్ చేసి విచారణ మొదలుపెట్టారు.

గోనె సంచిలోని మృతదేహాం అశోక్‌దిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన సోదరుడికి అంత్యక్రియలు నిర్వహించడానికి డబ్బులు లేక అన్నాచెల్లెలు బాడీని ముక్కలు ముక్కలుగా నరికి లంగర్‌‌హౌస్ దర్గా దగ్గర రోడ్డు పక్కన పడేసినట్లు పోలీసులు గుర్తించారు. దివ్యాంగుడైన అశోక్ మద్యానికి బాగా బానిసై చనిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. అన్నాచెల్లెలు ఆటోలో వచ్చి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయినట్లు సీటీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కాళీమందిర్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎల్ కాలనీకి చెందిన రాజు, స్వరూపలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంత్యక్రియలు నిర్వహించడానికి తమ దగ్గర డబ్బులు లేవని, అందుకే ఇలా చేసినట్లు నిందితులిద్దరూ చెబుతున్నారు. అయితే నిందితులు చెప్పే విషయం నిజమేనా? లేదా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.