సీబీఐ కస్టడీకి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్

చంచల్ గూడ జైలు నుంచి కోఠి కార్యాలయానికి తరలింపు

ys-bhaskar-reddy-and-uday-kumar-in-cbi-custody

హైదరాబాద్‌ః వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ను బుధవారం సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఈ ఇద్దరినీ 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇచ్చేందుకు న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చంచల్ గూడ జైలులో ఉన్న భాస్కర్ రెడ్డితో పాటు ఉదయ్ కుమార్ ను సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు వీరు కస్టడీలో ఉంటారు.

కస్టడీలోకి తీసుకునే క్రమంలో ఉదయం భాస్కర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో, ఆయనతో పాటు భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇద్దరినీ విచారణ కోసం కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఇప్పటికే కోఠి సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని కలిపి విచారిస్తామని సీబీఐ అధికారులు ఇది వరకే చెప్పారు. అవినాశ్ రెడ్డి కూడా అక్కడే ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.