అప్పులు, తప్పులపై ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి: యనమల

Yanamala Rama Krishnudu
Yanamala Rama Krishnudu

అమరావతిః టిడిపి కన్నా వైఎస్‌ఆర్‌సిపి రెండున్నర రెట్లు ఎక్కువ అప్పులు చేసిందని యనమల రామకృష్ణ విమర్శలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కు మాజీ ఆర్థిక మంత్రి యనమల లేఖ రాశారు. గత ప్రభుత్వం కంటే తక్కువ అప్పులూ చేశామని, నిబంధనలు పాటించామని ప్రభుత్వం చెపుతున్న అంశాలను ప్రశ్నిస్తూ లేఖ రాశారు యనమల.

కాగా, 2022 ఆడిట్ నివేదిక లో ప్రస్తావించిన అంశాల ఆధారంగా ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులపై సర్కారు వాస్తవాలు చెప్పాలని యనమల ప్రశ్నించారు. 2014-19 మధ్య టిడిపి హయాంలో చేసిన అప్పుల కన్నా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం రెండున్నర రెట్లు ఎక్కువ అప్పులు చేసిందని… రూ. లక్ష కోట్లు అసెంబ్లీ అనుమతి లేకుండా అప్పులు చేసినట్లు కాగ్ తన నివేదికలో గణాంకాలతో సహా నిర్ధారించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ గ్యారంటీల ద్వారా తీసుకున్న అప్పులు 2022 మార్చి నాటికే రూ. 1,18,003 కోట్లు అని కాగ్ తేల్చిందని.. మితిమీరిన అప్పుల కారణంగా 2024 ఏడాదిలో రూ.42 వేల కోట్లు అప్పులుగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.