ఆధారరహిత ఆరోపణలు ఏనాడు చేయలేదు : యనమల

అమరావతి : ఆధారరహిత ఆరోపణలు తానెన్నడూ చేయలేదని.. ఆ అలవాటు తనకెప్పుడూ లేదని లొసుగులు బయటపడ్డాయన్న అక్కసుతోనే.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తనపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత యనమల రామ‌కృష్ణుడు మండిపడ్డారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ఆర్టికల్ 360 ప్రయోగించి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలన్న తన డిమాండ్లన్నీ హేతుబద్ధమైనవేనని తేల్చిచెప్పారు.

కాగ్‌లో ప్రస్తావించినవే తానూ చెప్పానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ఆ‌ర్థికమంత్రి కాగ్ నోటింగ్స్​పై జవాబివ్వకుండా.. సంజాయిషీ చెప్పకుండా.. కావాలనే ఉద్దేశపూర్వకంగానే విస్మరించి.. కప్పదాటేశారని యనమల విమర్శించారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందనేది రూఢీ అవుతోందన్నారు. సీఎఫ్ఎణ్ఎస్ బైపాస్ చేయడం, ట్రెజరీ కోడ్ ఉల్లంఘన, ప్రత్యేక బిల్లుల పేరుతో అనుచిత రాటిఫికేషన్లు, అక్రమ బిల్లులు పాస్ చేసుకోవడానికి అవాంఛితంగా జీవో నెంబర్‌ 80 జారీ చేయడం వంటి లొసుగులన్నీ బయటపడేసరికి దిక్కుతోచకే ఎదురుదాడికి దిగారని ధ్వజమెత్తారు.

                                                                       

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/