మణిపూర్‌ హింస.. స్కూల్‌ బయట మహిళ కాల్చివేత

మణిపుర్ లో రెండు నెలలుగా పాఠశాలల మూసివేత

Woman Shot Dead Outside School In Manipur’s Imphal West District

ఇంఫాల్‌: మణిపుర్‌లో ఓ స్కూల్ బయట గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను కాల్చి చంపిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఇంపాల్ పశ్చిమ జిల్లాలోని స్థానిక శిశు నిష్తా నికేషన్ స్కూల్ ఎదుట ఈ ఘటన చోటుచేసుకోగా, మృతురాలి పేరు, వివరాలు తెలియరాలేదు. జాతుల వైరం నేపథ్యంలో మణిపుర్ లో ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. అల్లర్ల కారణంగా గత రెండు నెలలుగా స్కూల్స్ మూతబడ్డాయి. తాజాగా బుధవారం స్కూల్స్ తెరుచుకోగా, మరుసటి రోజునే ఓ పాఠశాల ఎదుట ఈ దారుణం జరిగింది. ఇప్పటికే విద్యార్థులు పాఠశాలలకు రావడానికి భయపడుతున్నారు. ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకోవడంతో మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. మణిపుర్ లో మే 3వ తేదీ నుండి ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

మరోవైపు, థౌబల్ జిల్లాలో ఐఆర్బీకి చెందిన ఓ జవాన్ ఇంటిని అల్లరిమూకలు దహనం చేశాయి. పోలీసు విభాగానికి చెందిన తుపాకులను ఎత్తుకెళ్లడానికి అల్లరిమూకలు ప్రయత్నం చేయగా, సదరు జవాన్ తిప్పికొట్టారు. దీంతో ఇంటిని దహనం చేశారు. ఇదిలా ఉండగా, ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయగా, దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై మణిపుర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఈ సేవలను పునరుద్ధరించే అంశంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది పెండింగ్ లో ఉన్న కారణంగా జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.