శ్రీసత్యసాయి జిల్లాలో మరో దారుణం.. బాలింతపై సామూహిక అత్యాచారం

ఏపీలో అత్యాచారాలు , మర్డర్ లు ఆగడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటన నమోదు అవుతూనే ఉంది. ప్రభుత్వాలు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో మరో దారుణం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన ఓ బాలింతపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆపై బండరాయితో మోది దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలంగా మారింది.

జిల్లాలోని కనగానపల్లి మండలానికి చెందిన మహిళకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఏడు నెలల క్రితం ఆమె ఓ బాబుకు జన్మనించింది. పది రోజుల క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. నిన్న ఉదయం బాబును తోడికోడలకు అప్పగించి బహిర్భూమికి వెళ్లింది. అప్పటికే అక్కడ కాపుకాసిన నిందితులు ఆమెపై దాడికి దిగారు. అత్యాచారం చేసి ఆపై బండరాయితో మోది హత్యచేశారు.

బహిర్భూమికి వెళ్లిన ఆమె 10 గంటలు అవుతున్నా తిరిగి రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు గాలించగా ఊరిబయట విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ముఖం పూర్తిగా ఛిద్రమై ఉండడాన్ని గుర్తించారు. సమీపంలోని బావి వద్ద ఉన్న బండరాళ్లను తెచ్చి ఆమెను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.