ఇక పుతిన్ తో తప్ప, ఏ రష్యా అధికారితోనూ సమావేశం కాబోము

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ప్ర‌సంగం

దావోస్: ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో దావోస్ లో జ‌రుగుతోన్న‌ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో వీడియో లింక్ ద్వారా జెలెన్‌స్కీ ప్ర‌సంగించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్ర‌సంగిస్తూ ప‌లు అంశాలు తెలిపారు. డాన్ బాస్ లో ప‌రిస్థితులు దారుణంగా మారాయ‌ని, చాలా మంది చ‌నిపోతున్నార‌ని ఆయ‌న అన్నారు. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాతో చర్చలు జరపడం క్లిష్టంగా త‌యారైంద‌ని తెలిపారు.

రష్యా ఫెడరేషన్‌ అధికారులు, ఉక్రెయిన్ అధికారుల మధ్య జరిగిన చర్చలు స‌ఫ‌లం కావ‌ట్లేద‌ని అన్నారు. పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంద‌ని మండిపడ్డారు. యుద్ధం చేయిస్తోంది పుతినే కాబట్టి ఆయ‌న‌తో నేరుగా చ‌ర్చించ‌కుండా ఈ యుద్ధాన్ని ముగించలేమ‌ని అన్నారు. రష్యా దళాలు జరిపిన యుద్ధ నేరాల గురించి చర్చలు జరిపేందుకు రష్యా విముఖత చూపించిందని ఆయ‌న తెలిపారు. దీంతో ఇక పుతిన్ తో తప్ప, ఏ రష్యా అధికారితోనూ సమావేశం కాబోమ‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే, దౌత్య మార్గంలో వెళ్ల‌కుండా ఈ యుద్ధాన్ని ఆపడం అసాధ్యమ‌ని కూడా ఆయ‌న అన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/