నాగబాబు చేతికి ఏమైంది..?
మెగా బ్రదర్ , జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు నాగబాబు చేతి కట్టుతో కనిపించడం ఇప్పుడు జనసేన కార్య కర్తల్లో , మెగా అభిమానుల్లో ఆందోళన పెరిగింది. ప్రస్తుతం జనసేన పార్టీ నా సేన కోసం.. నా వంతు.. పేరిట విరాళాలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ పిలుపు మేరకు జన సైనికుల నుంచి భారీ స్పందనే లభిస్తోంది. చిన్న మొత్తాల నుంచి లక్షల మేర విరాళాలు ఆ పార్టీకి అందుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జన సైనికులు రూ.4 లక్షల విరాళాన్ని మంగళవారం పార్టీకి అందజేశారు.
ఈ విరాళాన్న నాగబాబు అందుకున్నారు. ఈ సందర్భంగా కుడి చేతికి కట్టుతో ఆయన కనిపించారు. చేతికి కట్టుతోనే వచ్చిన ఆయన జన సైనికుల నుంచి విరాళానికి చెందిన చెక్కును అందుకున్నారు. నాగబాబు కట్టుతో కనిపించేసరికి ఆయన చేతికి ఏమైందా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరో ఏ కారణంగా ఆయన చేతికి కట్టు కట్టుకున్నారన్న విషయం వెల్లడి కాలేదు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టత కోసం సమైక్యంగా శ్రమించాలని ఆయన జన సైనికులకు సూచించారు.