పాశ్చాత్య దేశాలపై మంత్రి జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు
ఇతర దేశాల వ్యవహారాలపై కామెంట్స్ చేయడం పాశ్చాత్యులకు దురలవాటుగా మారిందని వ్యాఖ్య
న్యూఢిల్లీః భారత్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పాశ్చాత్య దేశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించడం పాశ్చాత్య దేశాలకు ఓ దురలవాటుగా మారిందని ఆయన అన్నారు. ‘‘ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించడం తమకు దేవుడిచ్చిన హక్కు అని పాశ్చాత్య ప్రపంచం భావిస్తుంది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరులోని కబ్బన్ పార్కులో ఆదివారం బెంగళరూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మంత్రి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పాశ్చాత్య దేశాలు మన విషయాలపై ఎందుకు వ్యాఖ్యానిస్తున్నాయో రెండు కారణాలు చెబుతా. పాశ్చాత్య దేశాలు ఇతర దేశాల వ్యవహారాలపై వ్యాఖ్యానించడం తమకు దేవుడు ఇచ్చిన హక్కు అని అనుకుంటాయి. ఇది మొదటిది. ఇక రెండోది ఏంటంటే.. మా విషయాల్లో కల్పించుకోండని మన ఆయా దేశాలకు ఆహ్వానం పలకక కూడదు. ఇండియాలో సమస్యలు ఉన్నాయని, మీరేం చేస్తున్నారని పాశ్చాత్య దేశాలను ప్రశ్ని్స్తూ వాటికి ఆహ్వానం పలకకూడదు. కాబట్టి.. రెండు వైపులా ఉన్న ఈ సమస్యకు కచ్చితంగా పరిష్కారం కనుగొనాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాల జోక్యంపై అనేక దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఇప్పటికే ఆయా దేశాలు పాశ్చాత్య అంతర్గత వ్యవహారాలపై కామెంట్స్ చేస్తున్నాయని చెప్పుకొచ్చారు.