వరదల వల్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చిన కుటుంబాలకు రూ. 2 వేలు ఆర్థిక సాయం: సిఎం జగన్‌

we-will-help-the-flood-victims-in-every-way-cm-jagan

కూనవరం: సిఎం జగన్‌ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలానికి చేరుకున్నారు. అక్కడ వరద బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునే విధానం పూర్తిగా మార్చేశామని అన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారం రోజులపాటు అధికారులు బాధిత గ్రామాలలోనే ఉంటూ సాయం అందిస్తారని తెలిపారు.  వరదల వల్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చిన కుటుంబాలకు కూడా రూ. 2 వేలు ఆర్థిక సాయం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు సీఎం జగన్. కటాఫ్ అయిన ఇళ్లకు కూడా రేషన్ అందిస్తామని ప్రకటించారు.  ఇప్పటికే బాధితులకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, పాలు, కూరగాయలు అందిస్తున్నామని..ఇల్లు దెబ్బతిన్నవారికి రూ.10 వేల ఆర్థికసాయం ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా ఉంచుతామన్నారు.

వారం తర్వాత తిరిగి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తానని తెలిపారు. సహాయం అందలేదని ఏ కుటుంబం కూడా చెప్పకూడదని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అధికారులు సరిగ్గా వ్యవహరించకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంలో లేదని సిఎం జగన్‌ స్పష్టం చేశారు.