‘మేం 5 వాగ్దానాలు చేశాం.. 2 గంటల్లో అమలు చేస్తాం’: రాహుల్..

కర్ణాటక ప్రజలకు స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన అందిస్తామన్న రాహుల్ గాంధీ

‘We made 5 promises, will implement in 2 hours’: Rahul Gandhi

బెంగళూరుః కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన అందిస్తుందని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలిపారు. తమ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని చెప్పారు. ‘‘మేం 5 వాగ్దానాలు చేశాం.. 2 గంటల్లో అమలు చేస్తాం’’ అని తెలిపారు. ఈ రోజు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులుగా 8 మంది ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలించదంటూ వివిధ విశ్లేషణలు జరిగాయి. నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులకు బాసటగా నిలవడం వల్లే కాంగ్రెస్ గెలుపు సాకారమైంది’’ అని తెలిపారు.

‘‘మా వెంట నిజం ఉంది.. మా వెనుక పేద ప్రజలు ఉన్నారు. కానీ బిజెపి దగ్గర డబ్బు ఉంది.. పోలీసులు ఉన్నారు.. ప్రతిదీ వారి దగ్గర ఉంది. కానీ కర్ణాటక ప్రజలు వారిని ఓడగొట్టారు’’ అని రాహుల్ అన్నారు. విద్వేషంపై ప్రేమ గెలిచిందని రాహుల్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలకు మరోసారి రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు 5 ప్రధాన హామీలు ఇచ్చిందని రాహుల్ గుర్తు చేశారు. ‘‘మేము ఎప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వము. ఏది చెప్పామో అదే చేస్తాం. మరో ఒకటి రెండు గంటల్లోనే కేబినెట్ తొలి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలోనే ప్రజలకు ఇచ్చిన 5 హామీలకు చట్టబద్ధత కల్పిస్తాం’’ అని ప్రకటించారు.