నేడు విపక్షాల సమావేశం..బీహార్ లో కాంగ్రెస్ గెలిస్తే దేశమంతా గెలిచినట్టేనన్న రాహుల్

విపక్షాల సమావేశం కోసం పాట్నా వెళ్లిన రాహుల్, ఖర్గే

We are going to defeat BJP together: Rahul Gandhi ahead of Opposition meeting

పాట్నా: వచ్చే ఎన్నికల్లో బిజెపి ఓటమే లక్ష్యంగా బీహార్‌ రాజధాని పాట్నాలో ఈరోజు ప్రతిపక్షాల నాయకులు సమావేశం కానున్నారు. అయితే విపక్షాల సమావేశానికి హాజరు కావడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాట్నాకు వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరిలోగా జరగనున్న తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో మనం గెలవబోతున్నామని అన్నారు. ఇకపై బిజెపి ఎక్కడా కనిపించదని జోస్యం చెప్పారు. పేద ప్రజల పక్షాన మనం ఉన్నాం కాబట్టే విజయాన్ని అందుకుంటామని చెప్పారు. బిజెపి కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల కోసమే పని చేస్తుందని విమర్శించారు. విపక్షాల సమావేశానికి హాజరు కావడానికి రాహుల్ పాట్నాకు వెళ్లిన సంగతి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

విద్వేషం, హింసను వ్యాపింపజేస్తూ దేశాన్ని బిజెపి ముక్కలు చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. మనం ప్రేమను, ఐక్యతను వ్యాపింపజేస్తున్నామని చెప్పారు. బిజెపిని ఓడించాలనే లక్ష్యంతో విపక్ష పార్టీలు ఇక్కడకు వచ్చాయని, అందరం కలిసి బిజెపిని ఓడిస్తామని అన్నారు. ప్రస్తుతం దేశంలో సిద్ధాంతపరమైన యుద్ధం జరుగుతోందని… కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో’ ఐడియాలజీతో ముందుకు వెళ్తుంటే… బిజెపి, ఆరెస్సెస్ లు ‘భారత్ తోడో’ సిద్ధాంతంతో సాగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ బీహార్ లో ఉందని చెప్పారు. మనం బీహార్ లో గెలిస్తే దేశం మొత్తం గెలిచినట్టేనని అన్నారు.