బెంగాల్లో శాంతి కావాలి..అల్లర్లు కాదుః సీఎం మమతా బెనర్జీ
కోల్కతాః బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా కోల్కతాలోని రెడ్ రోడ్డులో ఉన్న మసీదుకు వెళ్లారు. అక్కడ ఆమె ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. బెంగాల్లో శాంతి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తమకు హింస వద్దన్నారు. దేశంలో విభజన వద్దన్నారు. దేశాన్ని విభజించాలని కోరుకుంటున్నవారికి, ఈద్ సందర్భంగా ప్రామిస్ చేస్తున్నానని, ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తానని, కానీ దేశాన్ని విభజన కానివ్వనన్నారు.
మీరంతా ప్రశాంతంగా ఉండాలని, ఎవరి మాటలు వినిపించుకోవద్దు అని, ఓ గద్దార్ పార్టీతో పోరాటం చేస్తున్నానని, కేంద్ర ఏజెన్సీలతోనూ ఫైట్ చేస్తున్నానని, తనలో ధైర్యం ఉంది కాబట్టి పోరాడుతున్నానని, కానీ తాను తల వంచేది లేదని దీదీ అన్నారు. బిజెపి నుంచి కొందరు డబ్బులు తీసుకుని, ముస్లిం ఓట్లను చీల్చుతారని కొందరంటుంటారని, బిజెపి కోసం ముస్లిం ఓట్లను చీల్చే ధైర్యం వాళ్లకు లేదని ఆమె అన్నారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉందని, ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరో తెలిసిపోతుందని ఆమె అన్నారు. ఒకవేళ ప్రజాస్వామ్యం వెళ్లిపోతే, అప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్లిపోతారని, ఇవాళ రాజ్యాంగాన్ని మార్చేశారని, చరిత్రను మార్చేస్తున్నారని, వాళ్లు ఎన్ఆర్సీ తీసుకువచ్చారని, ఆ పని చేయనీయనని వాళ్లకు చెప్పినట్లు మమతా బెనర్జీ తెలిపారు.