వనపర్తిలో ఘోర ప్రమాదం : బోల్తాపడిన వోల్వో బస్సు..

వనపర్తి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దమందడి మండలంలోని వెల్దూరు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.

ఈ ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న ఓ కారు అక్కడ అగింది. దీంతో దానిని వెనుకనుంచి డీసీఎం ఢీకొట్టింది. దానివెనుకే ఉన్న లారీ.. డీసీఎంను గుద్దింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు