నేడు సిమ్లాలో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం
సీఎం పదవి పై రానున్న స్పష్టత!
సిమ్లాః కాంగ్రెస్ పార్టీ హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. అయితే సీఎం పదవిని చేపట్టేదెవరనే విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ శాసనసభాపక్షం సిమ్లాలో సమావేశం కానుంది. నూతన ఎమ్మెల్యేలంతా పార్టీ ప్రధాన కార్యాలయమైన రాజీవ్ భవనక్ మధ్యాహ్నం 3 గంటల వరకు చేరుకోవాలని పీసీసీ ఆదేశించింది. ఈ సమావేశానికి పార్టీ ఎలక్షన్ సూపర్వైజర్ భూపేశ్ బఘేల్, రాష్ట్ర ఇన్చార్జీ రాజీవ్ శుక్ల, భుపేంద్ర సింగ్ హుడా కూడా హాజరుకానున్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారని తెలుస్తున్నది.
అసెంబ్లీలోని 68 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లను సొంతం చేసుకున్నది. మరో 25 చోట్ల బిజెపి, మూడు స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి మొదట్లో అంతా సాధారణ మెజార్టీకి అటూఇటుగా సీట్లు వస్తాయని భావించారు. దీంతో ఎలాంటి బేరసారాలకు తావులేకుండా ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా చండీఘడ్లో హోటల్ను కూడా సిద్ధం చేశారు.
కాగా, సీఎం పదివి రేసులో సుఖ్విందర్ సింగ్ సుఖు, ప్రతిభా సింగ్, ముకేశ్ అగ్నిహోత్రి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ప్రతిభా సింగ్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తున్నది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/