తెలంగాణను వణికిస్తున్న చలి

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత భారీగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు గత మూడు రోజుల నుంచి దారుణంగా పడిపోతున్నాయి. సాయంత్రం 5 గంటలకే చలి మొదలవుతుంది. ఉదయం 8.30 దాటినా ప్రభావం చూపుతూనే ఉంది. ఈరోజు ఉదయం మబ్బులు కమ్మి ఉండడంతో రోడ్లపై వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న చలితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ సిటీవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చిన్న పిల్లలు, వృద్ధులు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉదయం కూలీ పనులకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. పెరిగిన చలితో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.

ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే 15 డిగ్రీ సెల్సియస్‌ కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ వెల్లడింది. ఉత్తరాది రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ సిటీలో ఇవాళ అత్యంత అల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. కాన్పూర్‌లో 11 డిగ్రీ సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి చంపేస్తున్నది.

దాంతో చలి బాగా పెరిగిపోయింది. జనం ఇండ్ల నుంచి కాలు బయటపెట్టలేక పోతున్నారు. పైగా గత కొన్ని రోజుల నుంచి చలి ప్రతాపం కొనసాగుతుండటంతో దాని నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటున్నారు.