టీడీపీ మేనిఫెస్టోపై విజయసాయిరెడ్డి కామెంట్స్
2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రాజమండ్రి వేదికగా జరిగిన టీడీపీ మహానాడు సభలో చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఇందులో మహిళలకు పెద్ద పీట వేయడంతోపాటు పేదలను ధనవంతులు చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ మేనిఫెస్టోపై విజయసాయిరెడ్డి తనదైన రీతిలో ట్విటర్ వేదికగా స్పందించారు. ‘అమలుచేయమంటారేమోనని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మేనిఫెస్టోనే మాయం చేసినవారు … ఇప్పుడు అల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ ‘మాయా’ఫెస్టోలో ఎవరు పడతారు?’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఇక టీడీపీ మినీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు చూస్తే..
1) పేదలను ధనవంతులు చేయడం
- టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలను సంపన్నులను చేస్తుంది.
- ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది
2) బీసీలకు రక్షణ చట్టం
- బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తాం.. ఈ చట్టం అన్ని విధాలా అండగా నిలుస్తుంది.
3) ఇంటింటికీ నీరు
- టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే “ఇంటింటికీ మంచి నీరు” పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ 4) అన్నదాత
- అన్నదాత పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం
5) మహాశక్తి
- ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ
- ‘తల్లికి వందనం’ పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు అందజేత
- “దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం
- “ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం
6) యువగళం
- రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన
- ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు 2500 రూపాయలు అందజేత