టిఆర్‌ఎస్‌పై విజయశాంతి విమర్శలు

రాజయ్య, కడియం శ్రీహరి గార్లకు కెసిఆర్‌ విలువ లేకుండా చేశారు

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా పరకాల టిఆర్‌ఎస్‌ మ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బిజెపి కార్య‌క‌ర్త‌ల దాడి, ఆ త‌ర్వాత చోటు చేసుకుంటోన్న ప‌రిణామాలు చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్నిప్ర‌స్తావిస్తూ..టిఆర్‌ఎస్‌పై బిజెపి నాయ‌కురాలు విజ‌య శాంతి విమ‌ర్శ‌లు గుప్పించారు.

‘అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల ప్రతినిధులైన వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన గతంలోని ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, కడియం శ్రీహరి గార్లకు ముఖ్యమంత్రి కెసిఆర్ గారు విలువ లేకుండా చేసిన అవమానపు ప్రభావమో ఏమో… ఈ రోజు వరంగల్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం అణగారిన వర్గాల ప్రజల పైనే కామెంట్స్ చేసే స్థాయికి తెగిస్తున్నారు’ అని విజ‌య‌శాంతి అన్నారు.

‘యథా ముఖ్యమంత్రి… తథా ప్రజా ప్రతినిధి… సాక్షాత్తూ సిఎం దళిత ఉప ముఖ్యమంత్రులను అవమానకరంగా తీసి పక్కన పడేసినప్పుడు… నేను కనీసం అణగారిన వర్గాలకు చెందిన ఉద్యోగులను హేళన చెయ్యకూడదా?… అని అనుకుంటునట్టుంది ఆ వరంగల్ ప్రజాప్రతినిధి తీరు’ అని విజ‌య‌శాంతి అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/