పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండదు..కేంద్రం
నిన్న పన్నులు పెంచుతూ ప్రతిపాదనలు
ఆ వెంటనే రాయితీలు ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నిన్న 2021-22 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన తరువాత దేశ ప్రజలు అత్యధికంగా చర్చించుకున్న అంశాల్లో పెట్రోల్, మద్యం ధరలు కూడా ఉన్నాయి. లీటరు పెట్రోలుపై రూ.2.50, డీజిల్ పైరూ. 4 చొప్పున ఏఐడీసీ (అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్)ను విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీంతో ఇంధన ధరలు పెరిగి, దాని ప్రభావం నిత్యావసరాలపై పడుతుందని పెద్ద చర్చలే జరిగాయి.
అయితే, ఆ వెంటనే ప్రజలపై మాత్రం ఈ భారం పడబోదని, పెట్రోల్, డీజిల్పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ (బీఈడీ), స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని తగ్గిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. బీఈడీని రూ. 2.98 నుంచి రూ.1.40కు, ఎస్ఏఈడీని రూ. 12 నుంచి రూ. 11కు తగ్గిస్తున్నామని, డీజిల్ పైలీటరుకు ప్రస్తుతమున్న బీఈడీని రూో. 4.83 నుంచి రూ.1.80కు, ఎస్ఏఈడీని రూ. 9 నుంచి రూ. 8కి కుదిస్తున్నామని ప్రకటించింది.
తాజాగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ విధించినా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండదని,. వినియోగదారులపై అదనపు భారం పడబోదని కేంద్రం పేర్కొంది.
ఇక మద్యం విషయానికి వస్తే, దిగుమతి చేసుకునే మద్యంపై 100 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ విధిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇదే సమయంలో 80 శాతం కన్నా తక్కువ ఆల్కహాల్ శాతం ఉండి, ఇంపోర్ట్ అయ్యే స్పిరిట్స్, వైన్స్ పై ఇప్పుడున్న 150 శాతం కస్టమ్స్ సుంకాన్ని 50 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. అంటే, దిగుమతి చేసుకున్న మద్యంపైర ఏఐడీసీ పన్ను అదనపు భారమే అయినా, ధరలో మార్పు రాబోదు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/