ఇంటికి వాస్తు మార్పులు చేస్తున్న వైఎస్ షర్మిల

YSRTP అధినేత్రి వైస్ షర్మిల..లోటస్‌పాండ్‌ లో ఉన్న తన ఇంటికి వాస్తు మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం షర్మిల సొంతగా పార్టీ పెట్టి గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గరైంది. మొన్నటి వరకు ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపిన ఆమె..ప్రస్తుతం తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, విలీనం ప్రక్రియ ఏమోగానీ ప్రస్తుతం షర్మిల తన నివాసమైన స్థలమైన లోటస్‌పాండ్‌కు మరమ్మతులు చేయిస్తున్నారు. అటు నివాసానికి, ఇటు పార్టీ కార్యాలయానికి మార్పులు చేర్పులు చేస్తున్నారు. అయితే, వాస్తు పండితులు చేసిన సూచనల మేరకు మరమ్మతులతో పాటు కొన్ని వాస్తు మార్పులు కూడా లోటస్‌పాండ్‌లో జరుగుతున్నాయి. పార్టీని విస్తరించే క్రమంలో చేస్తోన్న శ్రమకు, అదృష్టం కూడా కలిసి రావాల్సి ఉంటుందని భావిస్తోన్న షర్మిల- పార్టీ కార్యాలయాన్ని వాస్తుకు అనుకూలంగా మార్చితే బాగుంటుందని భావించారు. వాస్తు నిపుణుల సూచనల మేరకు మార్పులు చేపట్టారు.

పార్టీ ఆఫీసుకు సంబంధించిన గేటు పూర్తిగా వీధి పోటు ఉంటుంది. అయితే ఇటీవల ఒక వాస్తు సిద్ధాంతి షర్మిల పార్టీ ఆఫీస్, ఇల్లు పరిసర ప్రాంతాలను చూసి కొన్ని మార్పులు చేర్పులు సూచించారట. ఈ వీధి పోటు వల్ల తనకు రావాల్సిన రాజకీయ ఎలివేషన్ రావడం లేదంటూ ఆ సిద్ధాంతి చెప్పడంతో వెంటనే రోడ్డు వైపు ఉన్న గేటును తీసి మరోవైపునకు మార్చి వీధి పోటును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కార్యాలయం లోపల, ఇంటి వైపు కూడా కొన్ని వాస్తు సంబంధించిన మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ మార్పుల తర్వాత షర్మిల కు రాజకీయంగా ఎంత కలిసొస్తుందో చూడాలి.