చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

వర్షం, మంచు కురుస్తున్న నేపథ్యంలో విరిగిపడుతున్న కొండ చరియలు

char-dham-yatra-halted

న్యూఢిల్లీః చార్ ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాతావరణం ప్రతికూలంగా మారిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా చార్ ధామ్ యాత్రను నిలిపివేశారు. వర్షం, మంచు కురుస్తున్న నేపథ్యంలో యాత్రను ఆపేయాలంటూ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇచ్చిన ఆదేశాల మేరకు యాత్రను ఆపేశారు.

వారం రోజులుగా మంచు, వర్షం కురుస్తున్న నేపథ్యంలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీని కారణంగా ట్రాఫిక్ కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాతావరణం అనుకూలించిన తర్వాతే చార్ ధామ్ యాత్రను కొనసాగించాలని భక్తులను ముఖ్యమంత్రి కోరారు. మరోవైపు రానున్న 24 గంటల్లో టెహ్రీ గర్వాల్, డెహ్రాడూన్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.