ఐరోపా పర్యాటకులపై అమెరికా నిషేధం
కరోనా వైరస్ అడ్డుకునే చర్యలో భాగంగా నిషేధం..ప్రకటించిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఐరోపా దేశాల నుండి వచ్చే అన్ని రకాల పర్యాటకులపై నెలరోజుల పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అమెరికాలో 1,300 కరోనా కేసులు నమోదు కాగా, 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకునే చర్యల్లో భాగంగానే ఐరోపా నుండి తమ దేశానికి వచ్చే అన్ని రకాల పర్యాటకులపై నెలరోజుల పాటు నిషేధం విధిస్తున్నట్లు వైట్హౌస్ నుండి దేశ ప్రజలనుద్దేశించిన టెలివిజన్లో చేసిన ప్రసంగంలో ట్రంప్ ప్రకటించారు. ఈ ఉత్తర్వులు శుక్రవారం అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయని, అయితే ఇతర దేశాల నుండి స్వదేశానికి వచ్చే అమెరికన్లకు దీని నుండి మినహాయింపు వుంటుందని, కానీ వారు కరోనా వైరస్కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుందని ఆయన వివరించారు. ఐరోపా దేశాల కూటమి (ఇయు) ఈ వైరస్ విస్తృతిని అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంలో విఫలమైనందు వల్లే తమ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/