వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు..గుట్టలుగా నోట్ల కట్టలు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ఓ పర్ఫ్యూమ్ తయారీ సంస్థ యజమాని పీయూష్జైన్పై పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. దీంతో గురువారం ఐటీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. సోదాలు నిర్వహిస్తుండగా ఇంట్లో అనుమానాస్పదంగా రెండు అల్మారాలు కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా ప్యాక్ చేసిన నోట్ల కట్టలు కన్పించాయి. దీంతో ఐటీ అధికారులు షాక్ తిన్నారు. వెంటనే వారు బ్యాంక్ అధికారులను పిలిపించారు. మూడు కౌంటింగ్ మిషన్లతో డబ్బులను లెక్కించడం ప్రారంభించారు. నిన్న సాయంత్రం నుంచి ఈ నోట్ల కట్టల లెక్కింపు కొనసాగుతుండగా.. శుక్రవారం ఉదయం వరకు రూ. 150 కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.
కాగా, దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఊహజనిత కంపెనీలతో నకిలీ ఇన్వాయిస్లు , బిల్లులను పీయూస్ సృష్టించారని, జీఎస్టీ పన్నులు ఎగ్గొట్టారని విచారణలో తేలింది. కాన్పూర్లోని ఇంటితో పాటు మహారాష్ట్ర, గుజరాత్లోని ఆయనకు సంబంధించిన పలు కార్యాలయాలు, గోడౌన్లలోనూ తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఇందులో భాగంగా ఓ వేర్ హౌస్లో నకిలీ ఇన్వాయిస్లు ఉన్న నాలుగు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు.
పీయూష్ కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా సమాజ్వాదీ పార్టీ అనుచరుడిగా ఉన్నారు. ఆపార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్కు అత్యంత సన్నిహితుడు. ఇటీవల సమాజ్వాదీ పార్టీతో ప్రత్యేకంగా ఓ పర్ఫ్యూమ్ ను కూడా మార్కెట్లోకి విడుదల చేశారు పీయూష్. కాగా పర్ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది బీజేపీ. ‘ఎస్పీ’ అవినీతి వాసన ఇది అంటూ పోస్ట్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/