రామకుప్పంలో తీవ్ర ఉద్రిక్తత ..మహా ధర్నాకు టిడిపి పిలుపు

భారీగా మోహరించిన పోలీసులు

tdp-

అమరావతిః చిత్తూరు జిల్లా రామకుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రామకుప్పం ఎస్సై కృష్ణయ్య కులం పేరుతో మాజీ సర్పంచ్ మహాదేవి జయశంకర్ దంపతులను దూషించారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి మహాధర్నాకు పిలుపునిచ్చింది. పార్టీ పిలుపు మేరకు కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి టిడిపి శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నాయి. కాసేపట్లో మహాధర్నా ప్రారంభంకాబోతోంది.

ఈ నేపథ్యంలో పీఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఎస్సై తమను కులం పేరుతో దూషించారంటూ బాధితులు కుప్పంలో జడ్జికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆవరణలోనే ఎస్సై తమపై బూతులతో విరుచుకుపడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై నుంచి తమకు ప్రాణ హాని ఉందని చెపుతున్నారు.