జగన్ పాలనలో పేదలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారుః వల్లభనేని
అమరావతిః ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రంలోని పేద వర్గాలన్నీ ఆత్మగౌరవంతో బతుకుతున్నాయని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వమని చెప్పారు. జగన్ ఐదేళ్ల పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సాయం చేసిందని అన్నారు. తాను టిడిపి ప్రభుత్వంలో పనిచేశా, వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పని చేశానని… జగన్ ప్రభుత్వమే ఉత్తమమైనదని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ ప్రభుత్వంపై ప్రజలతో పాటు తనకు కూడా ఎంతో సంతృప్తి ఉందని అన్నారు. తనను ఓడిస్తామని నియోజకవర్గంతో సంబంధం లేని వాళ్లు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. గెలుపు ఓటములను నిర్ణయించేది ప్రజలని… నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వారు గెలుస్తారని చెప్పారు. వార్తల్లో నిలిచేందుకు కొత్తగా వచ్చిన వాళ్లు ఏదో ఒకటి మాట్లాడుతుంటారని విమర్శించారు.