ఉక్రెయిన్, రష్యా యుద్ధం..ప్రధాని మోడీ మరోసారి సమీక్ష
పాల్గొన్న కేంద్రమంత్రులు, అజిత్ దోవల్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మరింత తీవ్రతరం కావడంతో దాని పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. యుద్ధ ప్రభావం వల్ల జరిగే నష్టం, ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ వంటి అంశాలపై ఆయన చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జైశంకర్, పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ గంగలో భాగంగా ఇంకా చాలా మందిని ఉక్రెయిన్ నుంచి తీసుకురావాల్సి ఉంది. ఆ దేశ సరిహద్దు దేశాలకు ఇప్పటికే నలుగురు కేంద్ర మంత్రులు వెళ్లారు. కొందరు భారతీయులను ఉక్రెయిన్లో సైనికులు బందీలుగా చేసుకున్నారని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో నిజం లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆయా అంశాలన్నింటిపైనా మోడీ చర్చించినట్లు తెలుస్తోంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/