దాడికి దిగిన బంగ్లా యువ ఆటగాళ్లు
మ్యాచ్ గెలిచిన అనంతరం మైదానంలోనే తుంటరి చేష్టలు
![Bangladesh Players Involve In Ugly Physical Altercation After U19 World Cup Final](https://www.vaartha.com/wp-content/uploads/2020/02/Bangladesh-Players-Involve-In-Ugly-Physical-Altercation-After-U19-World-Cup-Final.jpg)
దక్షిణాఫ్రికా: తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన బంగ్లాదేశ్ అండర్ 19 జట్టు హుందాతనం మరిచిపోయింది. టోర్నీ గెలిచి గౌరవంగా నిలవాల్సిన జట్టు…క్రీడా స్ఫూర్తిని మరిచి మైదానంలో తుంటరి చేష్టలకు దిగి గౌరవం కోల్పోయింది. దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ మ్యాచులో గెలిచి చాంపియన్గా నిలిచిన బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు కాస్త అతిగా ప్రవర్తించారు. మ్యాచ్ గెలిచిన అనంతరం ఆటగాళ్లు ఉద్వేగంగా మైదానంలోకి పరిగెత్తుకొచ్చారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి జట్టు సభ్యులకు అభివాదం చేయడం అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడి లక్షణం.
కానీ అందుకు విరుద్ధంగా జెంటిల్ మ్యాన్ గేమ్ లో హుందాతనాన్ని మరిచి బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు ప్రవర్తించారు. మైదానంలోకి వస్తూనే టీమిండియా యువ ఆటగాళ్లను గేలి చేస్తు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ బంగ్లా యువ ఆటగాళ్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా పేసర్ షోరిఫుల్ ఇస్లాం టీమిండియా ఆటగాళ్లపై అనవసర వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు. ఓ ఆటగాడు అయితే ఏకంగా టీమిండియా ఆటగాళ్లతో గొడవకు దిగాడు. దీంతో మరో భారత క్రికెటర్ అతడిని నెట్టివేశాడు. ఫలితంగా అంపైర్ జోక్యం చేసుకొని ఇరు జట్ల మధ్య గొడవను సద్దు మణిగేలా చేశారు. ఇక ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, తప్పు చేసింది బంగ్లాదేశ్ ఆటగాళ్లేనని స్పష్టమవుతూ ఉండటంతో, పలువురు వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ తరహా చర్యలు తగవని, క్రికెట్ లో ఎదగాల్సిన పిల్లలు ఇలా గొడవకు దిగడం ఏంటని బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్లు కొందరు వ్యాఖ్యానించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/