మంచిర్యాలలో విషాదం..కరెంట్ షాక్తో తల్లి, కూతురు మృతి

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు కరెంట్ షాక్ తో మృతి చెందడం ఆ గ్రామంలో విషాదం నింపింది. జెల్ల సరిత తన భర్త, కుమార్తెతో కలిసి పోలం వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో విద్యుత్‌ షాక్‌ కు గురవడంతో తల్లీ కూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. భార్యా బిడ్డల్ని కాపాడేందుకు వెళ్లిన భర్త జెల్ల సమ్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన వచ్చి గాయపడిన జెల్ల సమ్మయ్యను ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదం రేపింది. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.