10 సెకన్లలో నేలమట్టమైన ట్విన్​ టవర్స్..

twin towers demolition

ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో నిర్మించిన ట్విన్​ టవర్స్ నేలమట్టమైంది. టవర్లను కూల్చివేసేందుకు 3,700 కేజీల పేలుడు పదార్థాలను వాడారు. వాటికి రెండు వేల వరకు కనెక్షన్లు ఇచ్చారు. కూల్చివేత వల్ల సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ భవనాల్లో ఉంటున్న వాళ్లను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. చుట్టుపక్కల బిల్డింగ్స్‌ను ప్లాస్టిక్ షీట్లతో కప్పేశారు. నోయిడాలోని సెక్టార్‌ 93ఏలో ఉన్న ఈ జంట భవనాలను నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించారు. దీనిపై దగ్గర్లోని సూపర్‌టెక్‌ ఎమరాల్డ్‌ కోర్టు సొసైటీవాళ్లు 2012లో కోర్టును ఆశ్రయించారు.

దాదాపు 9 ఏళ్ల పాటు న్యాయపోరాటం కొనసాగించారు. తొలుత ఈ ప్రాంతంలో గార్డెన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని వాదించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన అలహాబాద్‌ హైకోర్టు నిర్మాణ అనుమతుల్లో అవకతవకలు జరిగినట్లు తేల్చింది. భవనాల్ని కూల్చివేయాలని 2014లో ఆదేశించింది. తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. గత ఏడాది ఆగస్టులో అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సమర్థించింది. కూల్చివేతకు మూడు నెలల సమయం ఇచ్చింది. కానీ, సాంకేతికత కారణాల వల్ల ఏడాది సమయం పట్టింది.

ఈ జంట భవనాల్లో ఒక్కో మూడు పడకల ఫ్లాట్‌ విలువ రూ.1.13 కోట్లు. రెండు భవనాల్లో కలిపి 915 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిని అమ్మి ఉంటే ఆ సంస్థకు రూ.1,200 కోట్ల ఆదాయం వచ్చేది. ఇక 915 ఫ్లాట్లలో 633 ఇప్పటికే బుక్ అయ్యాయి. అందుకోసం సంస్థ కొనుగోలుదార్ల నుంచి రూ.180 కోట్లు సేకరించింది. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని 12 శాతం వడ్డీ చెల్లించి రీఫండ్‌ చేయాల్సి ఉంది.