ఆర్టీసీ కుటుంబానికి నా అభినందనలు: సజ్జనార్

RTC MD VC Sajjanar spot checks at Jubilee Bus Station

మేడారం జాతర ప్రశాంతంగా ముగిసిందని RTC ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. లక్షల సంఖ్యలో భక్తులు ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకొని తిరిగి క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారన్నారు. భక్తులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చిన ఆర్టీసీ కుటుంబానికి అభినందనలు తెలిపారు.

శనివారం సాయంత్రంతో జాతర ముగిసింది. మళ్లీ రెండేళ్లకు జాతరకు మళ్లొస్తం తల్లీ అంటూ భక్తులు ఇండ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. జాతరపై టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. లక్షలాది మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని.. మొక్కులు సమర్పించుకున్నారని తెలిపారు. బస్సుల్లో తిరిగి క్షేమంగా తమ సొంతూళ్లకు చేరుకున్నారన్నారు.

అతి తక్కువ సమయంలోనే మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి.. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్‌ను జాతరలో సిబ్బంది విజయవంతంగా అమలు చేశారన్నారు. ఈ జాతరలో ప్రతి ఒక్క సిబ్బంది సేవాభావంతో విధులు నిర్వర్తించి.. ఉన్నతస్థాయి వృత్తి నైపుణ్యాన్ని కనబరిచారన్నారు.

లక్షలాది మంది భక్తులను జాతరకు చేర్చే కీలకమైన, సంక్లిష్టమైన పనిని సమష్టి కృషితో విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ప్రయాణ సమయంలో భక్తులు ఆర్టీసీ సిబ్బందికి ఎంతగానో సహకరించారని.. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రజా రవాణా వ్యవస్థను ఆదరిస్తున్నామని, ప్రోత్సహిస్తున్నామని మరోసారి నిరూపించారంటూ కొనియాడారు.