TSRTC కి కోట్ల లాభం తీసుకొచ్చిన దసరా

తెలంగాణ ప్రజలు దసరా పండగను ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు. ఎక్కడో జీవనం కొనసాగిస్తున్న వారంతా తమ సొంతర్లకు వచ్చి పండగను కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. ఇక ఈ దసరా పండగ TSRTC కి కోట్ల లాభాలు తీసుకొచ్చింది. కేవ‌లం 11 రోజుల్లోనే ఆర్టీసీ ఖ‌జానాకు దాదాపు రూ. 25 కోట్ల అద‌న‌పు ఆదాయం వ‌చ్చిన‌ట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ద‌స‌రా పండుగను పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు టీఎస్‌ఆర్టీసీ 5,500 ప్రత్యేక బస్సులను నడిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1,302 ప్రత్యేక బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1,302 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఎంజీబీఎస్‌, జేబీఎస్‌తోపాటు నగరంలోని అన్ని పికప్‌ పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. ఈసారి టీఎస్ ఆర్టీసీ కూడా డైనమిక్ చార్జీలను అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా డైనమిక్ ఫేర్‌నే వినియోగిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌తో పోలిస్తే డైనమిక్ ఛార్జీలు తక్కువగా ఉండటంతో ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఇష్టపడ్డారు. పండుగ సందర్భంగా అక్టోబర్ 13 నుంచి 24వ తేదీ వరకు 11 రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడపగా.. తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల్లో తెలంగాణ ఆర్టీసీకి సుమారు రూ. 12 నుంచి రూ. 13 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే దసరా సందర్భంగా అదనంగా రోజుకు రూ. 2 నుంచి రూ. 3 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.